తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు రేపు తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ..!
ఇటీవల మీనాక్షి నటరాజన్తో రెండు గంటల పాటు చర్చలు రెడ్డి, బిసి, ఎస్సీ, మైనార్టీలకు కొత్త మంత్రి వర్గంలో అవకాశం

తెలంగాణ-ప్రభాత సూర్య:తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైందా? కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. అధికారిక ప్రకటన జారీ అవడమే తరువాయి అని చెప్తు్న్నారు. ఐతే ఎంత మందికి చోటు దక్కనుంది? ఎవరిని పదవి వరించనుందనే చర్చ మళ్లీ మొదలైంది.
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఊరిస్తూనే ఉంది. మంత్రి వర్గ విస్తరణ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి అనేక సార్లు అధిష్టానాన్ని కలిశారు. అంతేకాదు...ఆశవహులు సైతం అనేక మంది ఢిల్లీ నేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ఐతే వీటన్నిటికి చెక్ పడింది. తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రేపు తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తం ముగ్గురికి చోటు దక్కే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవులలోంచి.. తొలి విడతలో ముగ్గురికి చోటు దక్కనుంది. ఈ విస్తరణ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడానికి, అన్ని వర్గాలకు సమతుల్య ప్రాతినిధ్యం కల్పించడానికి ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.
మంత్రివర్గ విస్తరణలో కొత్తగా ఎవరు అడుగుపెడతారనేది తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ హైకమాండ్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎంపిక చేసేటప్పుడు పలు కీలక అంశాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. సామాజిక సమతుల్యత, ప్రాంతీయ ప్రాతినిధ్యం, ఎన్నికల్లో అభ్యర్థుల పనితీరు, పార్టీ పట్ల వారి విధేయత, అనుభవం వంటి అంశాలు ఎంపికలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
ఐతే రంగారెడ్డి జిల్లా నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, టీ రామ్మోహన్ రెడ్డి పోటీలో ఉన్నారు. వీరిలో ఎవరిని వరిస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు వివేక్, ప్రేమ్ సాగర్ రావు, శ్రీహరి, రాజగోపాల్ రెడ్డి పదవులు ఆశిస్తున్నారు. ఐతే ముగ్గురికి మాత్రమే చోటు కల్పిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎవరికి పదవి దక్కుతుందా అనే చర్చ సాగుతోంది.
About The Author
