కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దారెటు?
బుజ్జగించే ప్రయత్నం చేసిన కాంగ్రెస్

మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తిలో రాజగోపాల్ రెడ్డి.
మరో మూడు మంత్రి పదవుల్లో స్థానం కోసం ప్రయత్నాలు..!
అనుచరలు, కార్యకర్తలతో చర్చించి కార్యాచరణ..!
ప్రభాత సూర్య-(పొలగోని రాజేష్ గౌడ్ ):తెలంగాణ మంత్రి వర్గ విస్తరణలో ముగ్గురికి అవకాశం దక్కింది. ఈ విస్తరణ కాంగ్రెస్ లో చిచ్చు రేపింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి వంటి నేతలు తమకు పదవులు దక్కకపోవడంతో పార్టీ అధిష్టానంపై అసహనంగా ఉన్నారు. ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి గంపెడు ఆశాలు నిరాశ అయ్యాయి. దీంతో పార్టీ అగ్ర నేతలు రాజగోపాల్ రెడ్డితో చర్చలు జరిపి...బుజ్జగించినా...ఆయన వినడం లేదని తెలుస్తోంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి వెంకట్ రెడ్డి సోదరుడని అందిరికీ తెలిసిన విషయమే. ఐతే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. గతంలో కాంగ్రెస్ నేత అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల బీజేపీలో చేరి అక్కడ ఇమడ లేక...మళ్లీ సొంత గూటికే వచ్చారు. ఐతే ఎన్నికల ముందు పార్టీ మారుతూ పార్టీ పెద్దల దగ్గర మంత్రి పదవిపై అష్యూరెన్స్ తీసుకొనే చేరినట్టు స్వయంగా రాజగోపాల్ రెడ్డి చెప్పారు.
ఐతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక...తన అన్న సీనియర్ నేత వెంకట్ రెడ్డికి మంత్రి పదవి దక్కింది. తనకు కూడా పదవి దక్కుతుందని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణ జరిగిన ప్రతీసారి మంత్రి పదవి కోసం పైరవీలు చేశారు. తాను మంత్రి పదవి ఆశిస్తున్నట్టు బహిరంగంగా చెప్పారు. తనకు మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేస్తేనే...కాంగ్రెస్ లోకి వచ్చానని...తనతో పాటు ఇతర నేతలను గెలిపించుకున్నట్టు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు.
ఐతే సీనియర్ నేత జానారెడ్డి అధిష్టానానికి మంత్రి పదవులపై లేఖ రాయడం... ఆ లేఖపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. జానారెడ్డిని దృతరాష్ట్రుడితో పోల్చి మాట్లాడటంతో హైకమాండ్ కూడా సీరియస్ అయ్యింది. ఆ తర్వాత వివరణ కూడా ఇచ్చుకున్నారు. కానీ ఈసారి జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు మొండి చెయ్యే దక్కింది. ఐతే ఆయనను బుజ్జగించేందుకు ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చర్చలు జరిపేందుకు ప్రయత్నించగా...కలవడానికి ఇష్టపడలేదని తెలుస్తోంది.
ఐతే మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన అనుచరులు సైతం కాంగ్రెస్ అధిష్టానంపై ఆగ్రహంగా ఉన్నారు. దీంతో రాజగోపాల్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారని తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు రాజగోపాల్ రెడ్డి ఈ అంశంపై స్పందించలేదు. అలాగని తాను అలకవీడినట్టు ప్రకటించలేదు. కానీ తన అనుచరులు, కార్యకర్తలతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తనకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని చెప్పినట్టు సమాచారం. మరి ఆయన తదుపరి కార్యాచరణ ఏంటనేది ఉత్కంఠ రేపుతోంది.
About The Author
